
పెరిగిన టమాటా, ఇతర కూరగాయల ధరలతో వాటివైపు చూడాలంటేనే భయపడుతున్న జనానికి మరో షాక్ తగిలేలా ఉంది. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ పేర్కొంది. సరఫరా-డిమాండ్ మధ్య అసమతౌల్యం ఉందని, ఇది ఆగస్టు నాటికి కనిపించవచ్చని తెలిపింది.
రబీ ఉల్లి నిల్వ కాలం 1-2 నెలలు తగ్గినట్టు పేర్కొంది. ఈ నెలాఖరుకు ఇవి మరింత తగ్గుముఖం పడతాయని, ఫలితంగా సెప్టెంబరు నాటికి ధరలు పెరగొచ్చని అంచనా వేసింది. అయితే, ఖరీఫ్లో దిగుబడులు పెరిగితే ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని నివేదికలో పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబరు వర్షపాతంపై ఉల్లి ధరలు ఆధారపడి ఉంటాయని క్రిసిల్ వివరించింది.
|